Wednesday, May 30, 2012

రాయీ రాయీ కరిగే వేళయింది( revised)

(విజయవాడ సాహితీ మత్రులు భమిడిపాటి జగన్నాథరావు, నవోదయ రామ్మోహనరావు, శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేవ్వరరావు, డాక్టర్ వి. చంద్రశేఖర్ రావు మరి కొందరు మిత్రులు కలిసి "కథ- సమయమూ- సందర్భమూ" పేరుతో ఒక కథా సంకలనం తీసుకువచ్చారు. ఇందులో పది కథలు, వాటి నేపథ్యాలు, ఒక్కో కథపై ఒక్కో ప్రముఖ విమర్శకుడి విశ్లేషణా వున్నాయి. ఈ కథల సంకలనానికి నేను నీహార్ ఆన్ లైన్ డాట్ కామ్ వెబ్ సైట్ కు రాసిని రివ్యూ ఇది. ఇది నా ఇతర రచనల లాగే మిస్ అయిపోతే అప్పటి నీహార్ ఎడిటర్, ఇప్పటికీ మంచి మిత్రురాలు వసంత లక్ష్మి దీన్ని జాగ్రత్తగా భద్రపరిచి నాకు అందచేసింది. అప్పట్లో దీన్ని బుక్ లెట్ గా తెద్దామని కొందరు మిత్రులు ప్రయత్నించి అంతే త్వరగా విరమించుకున్నారు.)

థ- సమయమూ సందర్భమూ సంకలనంలో పల్లె సందుల నుంచి బయలుదేరిన వెతలూ ఉన్నాయి. నగరం సందిగ్ధాల్లోంచి బయటపడాలన్న తపన కతలూ వున్నాయి. వొకరకంగా  వర్తమాన సమయాన్నీ, సందర్భాన్నీ కొంతలో కొంత సమగ్రంగా రెప్రజెంట్ చేస్తున్న సంకలనం ఇది. సామాజికార్థిక రాజకీయ పరిణామ క్రమాల నుంచీ , సమూహం నుంచే కాక మరింత emphasisతో వొంటరి జీవితాల నుంచీ, వాటిల్లో చితికిపోయిన 'నేను' కిటికీల్లోంచీ ఆవిష్కరించే ప్రయత్నం పుష్కలంగా కనిపిస్తుంది ఈ పుస్తకం అంతా, ఆయా కథకులు రాసిన నేపథ్యాలు, విమర్శకులు రాసిన విశ్లేషణల సహా.
ఇన్నాళ్లుగా అపరిచితంగా అనామకంగా మట్టికొట్టుకునిపోయిన సామూహిక సాహసిక కార్యావరణంలో చిక్కి శల్యమైన వ్యక్తుల్లోకీ, వ్యక్తిత్వాల్లోకీ, బయటికీ పయనమవుతున్నారు ఈ కథకులంతా. ఆ చీకటి  గుయ్యారాల్లోకే వెళ్ళి అక్కడి నుంచి కేకవేయాలని ఆ బూడిద వర్ణపు జీవితావిష్కరణలకే నడుంకడుతున్నారు. స్థూలంగా ఇవన్నీ కతలు కతలుగా చెప్పుకున్న నక్సల్బరానంతరమ్ కతలే.
కత, నేపథ్యం, విశ్లేషణల సహితంగా ప్రయోగాత్మకంగా వెలువడిని ఈ సంకలనంలో పట్టుమని పది కతలే వున్నా వొక్కోటి వర్తమాన జీవితపు ఒక్కో పార్శ్వాన్ని సున్నిశితంగా పటాపంచలు చేసి కొత్త పాఠకులను తయారు చేసిపెడుతున్నాయి తెలుగు కథకు.

నూతన ఆర్థిక  విధానాల రూపేణా రుచి చూస్తున్న కొత్త వరల్డ్ ఆర్డర్ లోంచీ, వర్గం అన్న స్తూలాస్థిత్వంలోంచీ బయలుదేరిన మన వివేచనకొడవళ్ళ ప్రశ్నలతో సమ్మెట దెబ్బలు చవిచూసింది. మన సామాజిక రాజకీయ వుద్యమాల మౌలిక భావజాలాలపైనా, సాహితీకళారంగాలలోనా, మానవ సంబంధాల మధ్యనా ఆ కొడవళ్లు, సమ్మెటలూ తళతళ మెరుస్తూనే వేలాడుతున్నాయి. నక్సల్బరీ తరానికి ఈ కొడవలి కోతలూ, సమ్మెట పోటులూ అనుభవంలోకి, జ్ఞానంలోకి వచ్చే చారిత్రక అవకాశం లేదు. దళిత, స్త్రీవాద దృక్కోణాల నుంచి మొదలై మన జాతి సమష్టి జ్ఞాన సంపదనంతా గూటం దెబ్బలతో తవ్వుకుని వినిర్మించుకోవాల్సి రావడం, తాజా అంచనాలతో, అనుమానాలతో, అలజడితో, తృష్ణతో తిరిగి 'చారిత్రక చౌరస్తా'లో నిలబడాల్సి రావడం ఈ తరానికి మాత్రమే అనివార్యమైంది. ఈ కతా రచయితలంతా, వారు కన్న పాత్రలంతా, తయారు చేసుకున్న పాఠకులంతా, ఆవిష్కరిస్తున్న జీవితాలంతా ఈ కొత్త చారిత్రక చౌరస్తాల్లోంచి వుత్పన్నమయినవే కాబట్టి వీటిని అంచనా కట్టేందుకు సాహసించేందుకు వీటి రాజకీయార్థిక సామాజిక నేపథ్యాలతోపాటు ఈ తరమ్ దేహం, గుండె, మెదడు పరిచయమయి వుండటం అనివార్యమయిన అర్హత అనుకుంటున్నాను.
ఈ కతలను అర్థం చేసుకునే ముందు ఈ 'వ్యక్తి' (నేను) నేపథ్యాన్ని అర్థం చేసుకుంటూ, దీన్ని అంచనా కట్టేందుకు కొత్త దేశీ పరకరాలను రూపొందించుకుని మనల్ని మనం పునర్పరిచయం చేసుకోవడం వర్తమాన కథా విమర్శనకు అనివార్యం.
భావజాల రంగంలో దళిత స్త్రీ వుద్యమాలు రేపిన తుపాను భీభత్సానికి దాదాపు సమాంతరంగానే నూతన ఆర్థిక విధానాలు సామాజిక ఆర్థిక రంగాలను అల్లకల్లోలం చేసాయి ఈ నేలలోనా, పైనా. ఈ సంక్షోభ సమయంలోనే, సందర్భంలోనే ఈ తరమూ, ఈ రచయితలూ, వారి పాత్రలూ, పాఠకులూ వాచ్యంగానో, మేధోపరంగానో టీన్స్ నుంచి గ్రోనప్స్ అవుతున్నారు. అందుకే 1980-2000 మద్య వున్న సంక్షుభిత కాలాన్ని , తరాన్ని, సృజననూ బేరీజు వేసే ముందు మనల్ని మనం ఈ కొత్త నేపథ్యంతో జ్ఞానపరచుకోవడం తప్పనిసరి.

సంకలనంలోనే ప్రతి కతకీ నేపథ్యమూ, సమీక్షా వున్నందున చర్విత చరణం కాకుండా విడివిడి కతలకు సంబంధించిన పరిశీలనజోలికి వెళ్ళకుండా వీటిల్లోని వస్తు, శిల్ప, సంవిధాన, కథనాల్లో కతను తీర్చిదిద్దిన(ట్రీట్మెంట్) ధోరణులనూ, ప్రయోగాలనూ, వైచిత్రినీ, నవ్యతనూ, తాత్విక ప్రతిపాదనలనూ మాత్రమే పంచుకునేందుకు పరిమితమవుతున్నాను.

ఈ సంకలనంలో స్థూలంగా రెండు రకాల నేపథ్యాలున్న కతలున్నాయి. పల్లెల నుంచి యెవ్వరికీ చెప్పకుండా గంపెడంత దుఃఖంతో వచ్చి దాహార్తుల్లా చెల్లాచెదురై నగరానికో, మరో దూరానికో విసిరేయబడ్డ యువకుల అంతరాత్మల వెతుకులాటే నేపథ్యమైన కతలు మొదటిరకం. కానగపూలవాన, న్యూ బాంబే టైలర్స్, డాగ్ ఫాదర్, త్రిభుజపు నాలుగో కోణం, దూరానికి దగ్గరగా, నోరుగల్ల ఆడది కతలు ఈ కోవలోకి వస్తాయి.
ఈ రచయితలూ, పాత్రలూ పల్లెల నుంచి ఎగిరిపోబడినవాళ్లు. అవసరానికో, అనివార్యంగానో ఆ మట్టి వీధుల నుంచి , వాసనల నుంచీ, ఉద్వేగపు బంధాల రెక్కలు తెగినా, లేదా ఇంకా  విచ్చుకోకున్నాసరే  'ఎగిరి పోవాలి తప్పదు' అని అనుకుని, అనుకోకుండానే పయనమైన వాళ్లే ఈ రచయితలంతా.

ఈ కతలు రాయడమంటే, చదవడమంటే కేవలం పల్లె జీవితాన్నీ, స్మృతులనూ నెమరు వేసుకోవడం కాదు. గత కాలపు మొహమాటాల్లేకుండా innocence తో వాటిని తిరిగి revisit  చేయడమే.
ఇక ఈ సంకలనంలో వున్న రెండో రకం కతలు- నగరపు ఆమ్ల  మేఘచ్ఛాయల్లోంచి, ఉక్కపోతల్లోంచి, ఉక్కుపోతల్లోంచీ సనసన్నగానైనా, వొకరొక్కరిగానైనా పక్కకు జరిగి ఔట్ సైడర్స్ గా, participant - observersగా నిండు ఊపిరితో, నిబిడీకృతమైన పెను దుఃఖంతో నగరపు జలతారు ముసుగుల్నీ, తెరల్నీ, కోటల్నీ, అంతఃపురాలనీ తీసి, చింపి, పేల్చి, రచ్చకీడుస్తున్న వైనమే నేపథ్యమైన కతలు.
ఇన్ స్టెంట్ లైఫ్, నువ్వు నేను పడమటి ఆకాశం, భారతీయుడు, ఆత్మహత్యల రుతువు కతలు భిన్నంగా, బలంగా ఈ ప్రయత్నం చేసాయి.
80-90 దశకంలో వచ్చిన కతల్లో కొట్టవచ్చినట్టు కనిపించే వొక మార్పు, మలుపు తెలుగు కత తొక్కుతున్న కొత్త పుంతల వల్లే సాధ్యమవుతోంది. సమాజంలో ఆత్మిక, సైద్ధాంతిక, భావజాల, రాజకీయ, ఆర్థిక రంగాలతో పాటు అంతరంగాలలోనూ చోటు చేసుకుంటున్న అనివార్యతే ఈ నవ్యతకు భూమిక; కారణం కూడా.
రెండు ప్రపంచ యుద్ధాల అనంతరం యూరప్ చవిచూసిన విలువల పతనం కన్నా పదునైన, భీభత్సం కన్నా భీకరమైన, విధ్వంసం కన్నా వినాశకరమైన, లోనైన జుగుప్స కన్నా అసహ్యకరమైన గగుర్పాటు, గందరగోళం, అభద్రత, పరాయీకరణ, అస్థిత్వ సంక్షోభం, వ్యక్తి కేంద్రత వర్తమాన భారత సమాజం ఎదుర్కుంటోంది.
రెండు ప్రపంచ యుద్ధాల్లో భౌతిక హింసకు, విచ్ఛిన్నానికి తల్లడిల్లిన ఆ తరమ్ ఆలోచనల్లో రూపుదిద్దుకున్న అబ్జర్డిటీ, ఎక్జిస్టెన్షియలిజం, సర్రియలిజం లాంటి తిరుగుబాటు ధోరణులు అణుబాంబులు వేసుకోవడం కన్నా హీనమైన మానసిక హింసకు లోనవుతున్న ఇక్కడి ఈ తరం ప్రతిఫలనాల్లో కొత్త అర్థంతో తిరిగి రిలవెంట్ అవుతున్నాయి.
ఈ అనిశ్చితత్వంలో కొట్టుమిట్టాడుతున్న ఈ తరమ్ సృజనలో ఈ ధోరణులన్నీ రీవిజిట్ చేస్తున్నాయి. చేయనున్నాయి. ఇందుకు రుజువుగా ఈ సంకలనంలోని వైవిధ్యాన్నే చూపవచ్చు. మరీ ముఖ్యంగా కానగపూల వాన, భారతీయుడు, న్యూ బాంబే టైలర్స్, నువ్వు నేను పడమటి ఆకాశం, ఆత్మహత్యల రుతువు కతల్లోని అభివ్యక్తి ఈ ధోరణుల ప్రతిఫలనాలను పట్టి ఇస్తోంది.
80-90 లలో వస్తున్న కతల్లో కనిపిస్తున్న, బలంగా ముందుకు వస్తున్న మరొక అంశం టెక్నిక్. నవ్యత కోసం పరితపించడం వల్లా, అపూర్వత కోసం ప్రయత్నించడం వల్లా టెక్నిక్ అన్నది సహజంగానే  ముందువరుస తీసుకుంటుంది. రచయితల్లో ఈ టెక్నిక్ స్పృహ పెరిగిన తర్వాత ముందటి కతల్లాగా వర్తమాన కతలు లీనియర్ గా నడవటం చాల అరుదు. ఈ కతా సంకలనంలోని అన్ని కతల్లోనూ టెక్నిక్ కాన్షియస్ నెస్ వేర్వేరు మోతాదుల్లో , తలాల్లో కనిపిస్తుంది.

ఈ సంకలనంలో నోరుగల్ల ఆడది, డాగ్ ఫాదర్, నువ్వు నేను పడమటి ఆకాశం, త్రిభుజానికి నాలుగో కోణం కతలను తీసుకుంటే వీటిని ఈ సంకలనంలోని తక్కిన కతలతో వేరు చేస్తున్న వొక విభజన రేఖ వుంది. అది ఈ కతలలో కార్య వర్ణణ/ నివేదన( report of action) పాళ్లు మోతాదుకు మించి ఉండటమే.  తత్ఫలితంగా రచయిత జోక్యం ఎక్కువైపోయి వొక్కో సందర్భంలో పాత్రల మధ్య, ఇంకోసారి పాత్రలకన్నా వెనకబడీ అలా దిక్కుతోచక, exhaust  అయిపోయి బిక్కమొఖం వేసి నిలబడిన వైనం లీలగానైనా కనిపిస్తుంది. ఈ void ని భర్తీ చేసేందుకు రచయిత external techniqueలను ఆశ్రయించిన తీరు బట్టబయలవుతుంది.
నోరుగల్ల ఆడది కతలో వల్లంపాట వెంకటసుబ్బయ్య పసిగట్టినట్టు విస్తారమైన కాల వ్యవధిని, సుదీర్ఘమైన చరిత్రను నవలలో కాక కతలో ఇమడ్చడానికి బలవంతంగా ప్రయత్నించడం వల్ల రచయిత చేయి చేసుకుని మరీ ఆ పాత్రలను హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. డాక్యుమెంటరీ తరహాలో రాసానని ఉమామహేశ్వరరావు చెప్పినప్పటికీ వాయిస్ ఓవర్ శృతిమించడం వల్ల దృశ్యం, పాత్రౌచిత్యం సన్నగిల్లాయి. ఆ కారణంగానే ముగింపుకొచ్చేసరికి వాచ్యానికి దిగి చేతులెత్తిన వైనం కనిపిస్తుంది. ఈ రచయిత క్రితం కతల్లో యేనాడూ చేయని వొక ప్రయోగం తొలిసారి ఈ కతలో చేసాడు. ఎందువల్లో టెక్నిక్ కాన్షియస్ అయ్యాడు. బహుశా తనశైలిని తనే రిపీట్ చేస్తున్నాననో, కాపీ కొడుతున్నాననో అనుకునే రచయితలందరూ లోనయ్యే వొక అవస్థకు ఉమా మహేశ్వర రావు కూడా గురయ్యాడేమో అనిపిస్తుంది. అందుకే కత డిమాండ్ చేయకపోయినా డాక్యుమెంటరీ టెక్నిక్ ని ఆశ్రయించి కతకు అన్యాయం చేసాడు. ఉమా ఇదివర్లో రాసిన మంచివాడు, బిడ్డలుగల తల్లి, ముక్కుపుల్ల, మొగుడూ పెళ్ళాల ప్రేమకతల్లో అంతర్భాగంగానే వొక వున్నతమైన పరిణితి చెందిన టెక్నిక్, సీనిక్ డిసిప్లిన్ వుంటాయి. ఆ డిసిప్లిన్ డిస్మాంటిల్ చేయమని కతే ప్రోద్బలం చేస్తే తప్ప external technique జోలికి పోకుంటే మరింత పరిణితి చెందిన పాత్రలను పాఠకులకు పరిచయం చేసి వెంటాడగలడు ఉమ. ఈ లోపం వల్లే నోరుగల్ల ఆడది నోరే వినిపించకుండా పోయింది కతలో.
ఇదే disturbance డాగ్ ఫాదర్, త్రిభుజానికి నాలుగో కోణం కతల్లోనూ కనిపిస్తుంది.అయితే నువ్వు నేను పడమటి ఆకాశం కత శైలి పరంగా  stream of self conscious fiction లాగా నడవటం వల్ల ఈ disturbance ను పసిగట్టడం కొంచెం కష్టమవుతుంది. ఇది పసిగట్టేందుకు ఎక్కువ కష్టపడకుండా ఇదే సంకలనంలోని దాదాపు ఇదే ధోరణిలో నడిచిన భారతీయుడు కత చదవాలి. యాధృచ్ఛికమే అయినా ఈ రెండు కతలూ యూనివర్సిటీ వాతావరణంలో వున్న ఇద్దరు రచయితల నుంచి వెలువడ్డాయి. నువ్వు నేను పడమటి ఆకాశం కత వెంటాడే ప్రతీలన్నీ ఒక రూపం తీసుకునేందుకు పెనుగులాడుతున్నప్పుడు కసిగా అబార్ట్ చేసిన కల తాలూకు అనువాదంలా అర్థం చేసుకవాలి. ఇందులో రచయిత తన చుట్టూ రెక్కలున్న చిలుపట్టిన ఇనుప మేకుల్లాంటి పరిశీలనలను, వ్యక్తలను, దృశ్యాలను ఢీ కొట్టిస్తూ వాటి మద్య నిలబడి రిపోర్ట్, కామెంట్ చేసే ఒక భద్ర తలంలో వుంటూ కతను నడిపిస్తాడు. ఇందులో రచయిత పక్షాతీతుడైన స్వచ్ఛంద ఔట్ సైడర్. ఇది ఇమడలేని తనంలో నుంచి వచ్చే నిస్సహాయత. కతలోని అసంఖ్యాకమైన పాత్రలను పాఠకుడే స్వశక్తితో ప్రేమించే, ద్వేషించే, అర్థం చేసుకునే ప్రివిలేజ్ నిరాకరించేంతగా రచయిత జోక్యం, వ్యాఖ్యానం వుంటాయి. 
 రెండో భాగం 
ఇక external technique తో పనిలేకుండా, పని లేదన్న స్పృహతోనే నడిచిన కతలు ఇన్ స్టంట్ లైఫ్, న్యూబాంబే టైలర్స్, దూరానికి దగ్గరగా. టెక్నిక్ కళ్ళలోంచి  చూస్తే ఇవి సాదాసీదా కతలుగా కనిపిస్తాయి. కానీ వీటి సీనిక్ ఆర్డరే వాటి ఆయువు. మరీ ప్రత్యేకించి న్యూ బాంబే టైలర్స్  కతలో ఖదీర్ దర్గామిట్ట కతల్లోని ఆర్డర్ నుంచి  బయటపడుతున్న వైనం కనిపిస్తుంది. స్వతహాగా ఖదీర్ ది మనోహర జీవన చైతన్యాన్నీ, అందులో కనిపించని చమత్కారాన్ని పసిగట్టి మనముందుకు తీసుకువచ్చి ఆశ్చర్యచకితులను చేసే చార్లీ చాప్లిన్ టెక్నిక్. ముఖాలపై నవ్వు ఆరిన మరుక్షణం వుండబట్టలేనంత దుఃఖం ముంచుకువచ్చి కమ్ముకుని మన చేతనాచేతనలను కాల్చి కాలి కిందనేలను లాగేసుకుంటుంది. న్యూ బాంబే టైలర్స్ కతలో ఈ భీభత్సం మరింత గుచ్చకునేంతగా పరిణితితో కనిపిస్తుంది. గ్లోబలైజేషన్ గ్రామీణ జీవన చిత్రాన్ని ఎలా ఛిద్రం చేసిందో ఆగిన న్యూ బాంబే టైలర్స్ మిషన్ చప్పుడు మనకు సూదులు గుచ్చి మరీ చెబుతుంది. బాల్యాన్ని పునరర్పించుకుని, వినిర్మించుకుని బయోగ్రఫికల్ స్కెచెస్ రాసే రచయితలను తన ఇన్ ఫ్లూయెన్స్ వలయాల్లోకి లాగేసుకుని వొక పట్టాన వదలక పీల్చి పిప్పి చేసే మిట్టూరి మాంత్రికుడి కామ పంజరం నుంచి బయటపడగలిగీ ఖదీర్ నిలదొక్కుకుంటున్నాడని న్యూ బాంబే టైలర్స్ కత దర్గా మిట్ట మీద నిలబడి మరీ చాటుతోంది.

ఈ సంకలనంలో ఒక అంచున 'కానుగ పూల వాన', మరో అంచున 'ఆత్మమత్యల రుతువు' వుండటం కేవలం యాధృచ్ఛికం కాదేమో! ఈ ఇద్దరు రచయితలను (మరీ ప్రత్యేకించి చంద్రశేఖరరావును) అర్థం చేసుకునేందుకు విశ్లేషకులు ఎక్కువగా వాడుతున్న మాట మ్యాజికల్ రియలిజమ్. ఈ మ్యాజికల్ రియలిజమ్ గురించి అభంశుభం తెలియని గోపిని కరుణాకర్ గురించి  తర్వాత ప్రస్తావిస్తాను. ముందు చంద్రశేఖరరావు సంగతి.
ఇటీవలి కాలంలో వొక ధోరణిగా చాలా మంది కతకుల దృష్టిలో ఒక 'స్కూల్ ఆఫ్ రైటింగ్'గా ముందుకు వచ్చిన కతకుడు చంద్రశేఖరరావు. ఇతని కతల్లో మనల్ని తీవ్ర మైన, ఘాడమైన ఉద్వేగాలలోకి తీసుకెళ్ళే విలక్షణమైన శిల్పం-శైలి మెరుస్తాయి. విభిన్న తలాలలో విహరించి వచ్చే సమాంతర కతాగమనమూ ఉపరితలంలో తళుక్కుమంటాయి. కత లోలోతుల్లో యేకాకితనం, పరాజితుల వేదన, మానసిక సంక్షోభం, రికామీ, పశ్చాత్తాపం, నిరాశ- లాంటి అనేకానేక ఉద్వేగాలతో, మనస్తాపాలతో, మనోవేదనలతో పాత్రలు పరిచయమవుతాయి. చివరికి పరిచయస్తుల్లానే మిగిలిపోతాయి. వొక్ మాటలో చెప్పాలంటే చంద్రశేఖరరావు కతల్లో 'అనంత శోక భీకర తిమిర లోకైక పతులూ, పత్నులే' ప్రొటాగనిస్ట్ లు, ఆంటగనిస్టులు. ఇతని పాత్రలు ఎప్పుడూ ఏదో తెలియని అన్వేషణలో వుంటాయి. అయితే అన్ని రకాల సైకలాజికల్ ట్రామాలనీ, ట్రాన్స్ఫర్మేషన్లనీ తన కతలలో నిర్మొహమాటంగా ఎంబలిష్ మెంట్స్ గా ( చంద్ర శేఖరరావు తన నేపథ్యంలో చెప్పుకున్నట్టు పోస్ట్ మాడ్రన్ అందాలను అద్దడం) చక్కగా, చాకచక్యంగా వొకింత కవితాత్మకంగా అమర్చుకునే నైపుణ్య ఇతనికుంది. అందువల్లే ఇతని పాత్రల అన్వేషణ ఛద్మవేషగవేశణమైపోయింది. భావన నిజీయితీ కోల్పోయి కేవల అలంకరణగానే మిగిలిపోయింది.
ఇక తన కతలో ఎన్నెన్ని ' మెటఫరికల్ డ్రామాలు, క్యాప్సల్ లోపలి మందులాంటి మూడ్స్, కత్తి ంచున సాగే నడకలాంటి గగుర్పొడిచే విన్యాసాలు, సింబాలిక్ మీనింగ్స్, మెటఫరికల్ ట్రాప్స్, ఇంప్లాంటేషన్లు, ఇంజెక్షన్లు, ఎక్స్ ప్రెషనిస్టిక్ ట్రిక్స్, ఫ్రాంజ్ కాఫ్కాలు, గాబ్రియేలా గార్షియా మార్క్వెజ్ లు, సామ్యూల్ బెకెట్ లు, కొలాజ్ టెక్నిక్కులు' వగైరా తదితర మొదలైన దినుసులు ఎన్నెన్నేసి ఏఏ మోతాదుల్లో నర్మగర్భంగా వున్నాయో చంద్రశేఖరరావే తన నేపథ్యంలో వొప్పుకున్నందుకు నాకింకేమీ మిగల్లేదు చెప్పడానికి.
తన ట్రిక్స్ మీదా, ట్రాప్స్ మీదా ఇంతేసి 'స్పష్టత' వున్నందువల్లేనేమో బహుశా చంద్రశేఖరరావు కతలు రీడర్ ఫ్రెడ్లీనెస్ నుంచి తప్పుకుని క్రిటిక్ కాన్షియస్‌ అయిపోతాయి. శైలీ పరంగా చంద్రశేఖరరావు విశ్వనాథ సత్యనారాయణకు పోస్ట్మాడ్రన్ కొనసాగింపు. పాఠకులు వఠ్ఠి వెర్రివెంగళప్పలు, అన్నీ మనమే చెప్పేడవాలి అనుకునే వేయిపడగల రచయిత శైలికీ చంద్రశేఖరరావు వైలికీ పొంతన వుంది. సమయం వచ్చినా రాకున్నా సందర్భం వున్నా లేకున్నా తనో, తన పాత్రల చేతనో, లేదా తను ప్రేమలో పడిన పదానికి టీకాటిప్పణి, వ్యుత్పత్తర్థము, విగ్రహ వాక్యము చెప్పడంలో విశ్వనాథవారికి తీసిపోరు చంద్రశేఖరరావు. ఉదాహరణకు requium  అనే మాటకు నిఘంటువు (బ్రౌణ్యో మరోటో) చూసుకుని అర్థం వెతుక్కునేంత తెలివితేటలున్న పాఠకుడుంటాడా ఈ లోకంలో అన్న దయతో కూడిన శంక వల్ల ఆ పదానికి అర్థం చెప్పి, అక్కడికీ అర్థం కాకుండా అశేష పాఠకులు మిగిలిపోయి వుంటారన్న వల్లమాటిన ప్రేమతో కొంత వ్యాఖ్యానాన్ని పొందుపరుస్తాడు. ఇట్లాంటిదే  qnxiety neurosis అన్నమరో  ఆంగ్ల పదబంధం. దీని గురించి కూడా వైవి (అంటే యదువంశి) అనే పాత్రతో విక చాంతాండంత ఉపన్యాసం ఇప్పించి చితక్కొట్టి చెవులు మూయిస్తాడుప కతను information counter  చేసేస్తాడు చంద్రశేఖరరావు.
నిఆనికి ఆత్మహత్యల రుతువు కతకే కాదు చంద్రవేఖరరావు రాసిన లెనిన్ ప్లేస్ లోని మరే కతకూ కూడా మ్యా.జికల్ రియలిజమ్ అనే దానితో సంబంధం లేదు. 'మ్యాజికల్ రియలిజమ్ అని దేన్ని అంటారో ఇక్కడ చర్చ అనవసరం' అన్న తిరుపతిరావు చేసిన ట్రిక్ నే నేనిక్కడ ప్లే చేయదలచుకున్నాను. మరయితే చంద్రశేకరరావు ఒక ధోరణి కాదా?  అంటే ముమ్మాటికీ అవుననే సమాధానం చెప్పాలి.
సినిమాను మణిరత్నం ఎలాగయితే టెక్నికల్ వండర్ చేసి,  A mess of interdependant techinicians గా మార్చి సినిమాను  technique in itself  చేసాడో తెలుగు కతా సాహిత్యంలో చంద్రశేకరరావు కత కూడా collage of promos గా మిగిలింది.
నిజానికి ఈ కతా సంకలనంలో మిగతా కతలన్నీ ఒక ఎత్తయితే కానగపూల వాన ఎంతో ఎత్తు.
గోపిని కతలు దుస్సార, తిప్ప తీగలతో అల్లుకున్న కంగుంది దృశ్యాలు. జీవిత సేవించిన కైపులో పాడే బైరాగి పాటలు, జక్కీకు పదాలు. టెక్నిక్ పరంగా ఉపరితలంలో, ఫస్ట్ ఇంప్రెషన్ లో మ్యాజికల్ రియలిజమ్ తాలూకు అడాప్టెడ్ అంశ ఏదో వున్నట్టు తోస్తుంది. దీనిక కారణం కతలకు, విమర్శకులకు మ్యాజికల్ రియలిజమ్ స్మరణ చేయడం తెలిసినంతగా జానపద మంత్ర మార్మికత పట్ల అవగాహన, ప్రేమ లేకపోవడమే.
గోపిని కరుణాకర్ కతలన్నింటిలోనూ  అవ్వ చెప్పిన కతలను తిరిగి పిల్లలు తమ కాల్పనిక జగత్తులోంచి నడిపించి చెప్పే వొక టెక్నిక్ వుంటుంది. పసితనపు అమాయకత్వంతో పాటు భౌతిక ప్రపంచపు విభజన రేఖలు తెలీని అచ్చమైన, స్వచ్ఛమైన తాజా కంఠమొకటి వినిపిస్తుంది గోపిని కథనంలో. ఈ పసి ప్రపంచపు అమాయత్వంలో కామం-ప్రేమ, దేహం-మనసు, ఆడ-మగ, సుఖం-దుఃఖం, మంత్రం-వాస్తవం, కలిమి-లేమి, కల-నిజం లాంటి బాహ్య ప్రపంచపు సామాజిక విభజనలు, ద్వంద్వాలు వుండవుప రద్దు చేయబడతాయి. పిల్లలకు ఈ రేఖలు, శృంఖలాల గురించి అస్సలేమీ తెలీదు. ఇదే స్థితి కానగపూల వాన కతలో కురుస్తుంది. నిజానికి మాదిగ లచ్చిమి, పెదబ్బలు రెండు దేహాలు, లింగాలు, తరహాలు, కులాలు, జీవితాలు, తలాలు, దుఃఖాలు, కలలు, నిజాలు. కానీ కత మాత్రం ఇవన్నీ ఒక సారి చెరిగిపోయిన, మరోసారి పెనవేసుకుపోయిన తలంలోంచే పలుకుతుంది.
అందుకే మాదిగ లచ్చిమి, పెదబ్బలు వొక్కే వ్యక్తికి రెండు దేహాలుగానూ, లేదా రెండు శరీరాలకు ఒక్కే వ్యక్తిగానూ నిలస్తారు.
మనుషులుగా సాధించాల్సిన ఈ స్థితిని లచ్చిమి, పెదబ్బలు మిన్నాగులై, గుర్రాలై, పక్షులై, చేపలై, సీతాకోక చిలుకలై, నెళ్లయి, చామలై, ఏనుగులై, పులులై, జింకలై సాక్షాత్కరింప చేసుకుంటారుప కానగపూల వానై జలజలమంటారు. ఈ కత లోపలి దృశ్య సమన్వయంలో వున్న ఈ ఐంద్రజాలిక మార్మికత, మంత్ర వాస్తవికత, గమనంలోని అంతః స్రవంతులు, సంవిధానంలోని అంతరాల అంతరాళాలు సంఘర్షణలూ కేవలం మౌఖిక జానపద కల్పనాత్మకే, చూపుకే, కళ్ళకే, దృష్టికే సాధ్యం. అందుకే గోపిని కరుణాకర్ వర్తమాన సమయంలో, సందర్భంలో, వాతావరణంలో జానపద శైలిలో ఎపిక్ స్టోరీస్ చెప్పగల సమర్థుడు. కతలోని సీనిక్ డివిజన్, ఫ్లో, సర్ కమ్ స్టెన్సెస్ చూస్తే గోపినికున్న సినిమా పరిజ్ఞానం ఎంత లోతైనదో, పరిణితమైనదో, స్వతఃసిద్ధమైనదో అర్థం చేసుకోవచ్చు. గోపిని కరుణాకర్ గొప్ప కతకుడు, ప్రామిసింగ్ రైటర్ అని అనడం కన్నా అతను మనం కోల్పోయిన అవ్వ, జానపదం, జీవితంలోని ఇంద్రజాలం, బతుకులోని మంత్రం.
ఇంతటి వైవిధ్యమున్న కతలను రెండు అట్టల మద్య మాగిన అక్బర్ గీతలతో అందించిన విజయవాడ సాహితీ మిత్రులు ముందు ముందు విశ్లేషణలు లేకుండా సంకలనం చేస్తారని ఆశిస్తాను. విశ్లేషణ, విమర్శ సృజనాత్మక ప్రక్రియలే అయినా సృజనను శాశించే దుర్మార్గం చేస్తూ వస్తున్నాయి ఈ నేలలో. మనకు విబేధించడానికీ, ద్వేషించడానికీ మధ్య తేడా తెలియకపోవడం వల్ల కూడా విమర్శ ముసుగులో ఈ డ్యామేజ్ జరిగిపోతోంది. ఈ డ్యామేజ్ ఈ కతా సంకలనంలోని విశ్లేషణల్లోనూ తేటతెల్లమవుతోంది. కనీసం కతా విమర్శ అయినా మొహమాటపు కంచెలు దాటి స్వచ్ఛంగా, తాజాగా, దేశీగా, సాహసంగా కూడలిలో నిలబడుతుందని ఆశిద్దాం.




Saturday, May 26, 2012

బిర్లాకు టాటా

నేల నేడు పది యుద్ధాలు
పిల్లలు ఆడుకునే చోటంతా
    ఇప్పుడు కుప్పకూలిన కొంపలు
గోరీలు    గోరీలు    గోరీలు
తెగవేసిన పసిబిడ్డల తలలు
బిడ్డల కళ్ళముందే
    చీలికలైన తల్లుల మానాలు

ఈ జాతరకంతా కారణం వుందని చాటిస్తున్నారు వాళ్ళు
కమ్యూనిజం చచ్చిపోయిందహో! అని

భూగోళం ఇప్పుడు వొక టైంబాంబు
టిక్ టిక్ టిక్ టిక్ టిక్
వాళ్ళ పెంట వేసే పెరటిదిబ్బ అట
    మన మూడో ప్రపంచం
వాళ్ళ యేసీ పిగోతీ  చల్లగా వుంటే చాలు
మన కడుపులు కాలిపోతేనేం
వొరే తిక్కలోడా
అసలుసిసలు మాటొకటి వుంది
అదే అదే కమ్యూనిజానికి కాలం చెల్లింది

ఇల్లు లేని వాళ్లను
వ్వెవ్వెవ్వెవ్వెవ్వెవ్వెవ్వెవ్వెవ్వెవ్వెవ్వెవ్వెవ్వె క్కిరిస్తాయి
మేడలపై  పై మేడలపై మేడలపై మేడలపై మొలిచిన మేడల తలలు
అందని ఐస్ క్రీముల మీదినుంచి
జారిపోయే అనాదల అలమటింపు చూపులు

బంగారు బిడ్డల కాక్షేపానికి
టీవీలో మమ్మీ కెల్లాగ్స్ తినిపిస్తోన్నా
పిడికెడు మెతుకుల కోసం
చెత్తకుప్పల్లో ఒక అమ్మ ఆకులు నెమకుతోన్నా సరే
కమ్యూనిజం ఓడిపోయింది... పోయింది... యింది... ది

సెక్సోత్సాహం కావాలా
హింసానందం కావాలా
ఏం కావాలి
రిమీట నొక్కితే చాలు
యెత్తేయ్ జెండా .... వేసేయ్ ఓటు
ఇంతకన్నా లేదు సాంస్కృతిక విప్లవం

నిజానికి ప్రపంచమే వొక పేద్ద ఛానల్
ఈ గోళం శ్రీమాన్ మర్డోక్ నవ్వులతో
గలగలలాడే చిన్న హుండీ
నో వండర్! క్యాపిటలిజం పూసుకువస్తోంది

ఈ లోకమే వొక మాయాబజార్
నిన్నుకొనేస్తా... లేకుంటే అమ్మేస్తా
ఎంత చెమటకంత పర్సెంట్ డిస్కౌంట్
స్వేచ్ఛా విఫణిలో పదేపదే  పాడే వేలం పాటొకటి వుంది
వొకటోసారి
    తక్కువ మనుషులు... ఎక్కువ చేతులు
రెండోసారి
    తక్కువ మనుషులు... ఎక్కువ చేతులు
మూడోసారి
    తక్కువ మనుషులు... ఎక్కువ చేతులు
వాతావరణమంతా స్పిరిట్ ఆఫ్ ఫ్రీడం
ఆఖరాఖరారాఖరారాఖరారాఖరారాఖరారాఖరికి
కమ్యూనిజం చచ్చింది

ఆడే రెక్కలకే కూలీ రేట్లంటే
మానవ మక్కులనే తుంగలో తొక్కడం
గతిలేక పిల్లలే వళ్ళొంచినపుడు
వాళ్ళ గల్లా పెట్టలు మైమరచి తైతక్కలాడతాయి
ఆహా! ధూళికన్నా కారుచవక కూలి
అది యెంతెంతో అదనపు విలువ
యెంతెంతెంతెంతెంతెంటే
స్వర్గకూపం అయిపోయిన ఈ గ్లోబంత
తీయ్ సీసా... సే ఛీర్స్
కమ్యూనిజం అమర్ రహే

అమ్మేస్తాం లేత యవ్వనాల్ని
వయసు తొమ్మిదా పంతొమ్మిది జానేదేవ్
నీ మనసైన రంగే
నలుపు... తెలుపు .. చామనచాయ
కళ్లేం పోవు ...పాపమూ కాదు
నీకు తెలియదా
భక్తునికీ భగవంతునికీ అనుసంధానమైనది
వ్యాపారబంధమేనని
కనుక
    కాబట్టి
        అందువలన
కమ్యూనిజం కాల ధర్మం చేసింది
పైగా వాళ్ళే దాన్ని పూడ్చింది

పూడ్చింది దాన్నేనా?
కాదు
వాళ్ళను రేయింబవళ్లు వెంటాడుతూనే వుంది
అపుడంత వాళ్ళ చేతుల్ని నెత్తుటిలో ముంచుతారు
అపుడంతా వాళ్ళొక పాటను కసిగా చంపుతారు
అపుడంతా వాళ్ళొక అమాయకుణ్ణి నక్జలైట్ చేస్తారు
అపుడంతా వాళ్లొక స్వప్నాన్ని చిదిమేస్తారు
అపుడంతా లోకకళ్యాణం గురించే ఊకదంపుడు
అపుడంతా వాళ్లొక దృక్పథాన్ని వల్లిస్తారు

ఇంతా చేస్తే హఠాత్తుగా దీన్నంతా పటాపంచలు చేస్తుంది
వొక మృతవీరుడి చిమ్మిన రక్తపులేచిన చేయి
యిక పగటికలలే వాళ్ళను పీడకలలై చుట్టుకుంటాయి
వాళ్లను ముంచెత్తివేసే
యెర్రెర్రని ఉత్పాతం అట్టడుగునుంచి
మనకు వినిపిస్తాయి
సర్పభూయిష్టమైన బుసబుసల హీనస్వరాలు
కమ్యూనిజం చచ్చిపోయింది

ఇంగ్లీష్- సత్యజిత్ భక్తాల్, స్వాతి
తెలుగు- అనంతు, సౌదా
22-03-1997, వార్త

english title- Tribute to Capitalism





Monday, May 14, 2012

ఏది అక్షరం? ఏది ఆయుధం?


పెట్టుబడికి అభిప్రాయాలుండవు. ప్రయోజనాలు మాత్రమే వుంటాయి. అవి మారినప్పుడల్లా అభిప్రాయాలు వాటంతటకవే మారిపోతుంటాయి ఆయా పత్రికలవీ, టివీలవి- పురాతన మీడియా సామెత

సాక్షి పత్రిక ప్రారంభం రాష్ట్రంలో దిన పత్రికల మార్కెట్ నే కాదు, ఒక వర్గం కొమ్ము కాస్తున్న ఏక శిలా (కులా) మీడియా ను కూడా చీల్చింది. ఇప్పుడు దిన పత్రికల 'పాలసీ' ఇదివరకటి సత్తెకాలంలోలాగా ముసుగులో లేదు. బాహాటంగానే తమ లైన్ ప్రకటించిన ప్రధాన స్రవంతి పార్టీలలాగే ఇక్కడి మీడియా సంస్థలూ వ్యవహరిస్తున్నాయి. చాలా కాలం వరకు ఒక కులమే గుత్తాధిపత్యంగా తమ చెప్పుల్లో, చేతల్లో మీడియాను పెట్టుకుంటూ వచ్చిందనేది తిరుగులేని సత్యం.
(అయితే కులం అని అనకుండా కొత్త మేలి ముసుగు వేసి చెలామణి చేస్తున్న ఈ "సామాజిక వర్గం" అన్న పదబంధం పుట్టుక 90 లనాటి ఆయా పత్రికల ఆస్థాన పండితుల సృష్టే. ఒక కులం నొచ్చుకోకుండా, పచ్చిగా కనిపించకుండా కొంత సౌకుమారతను అభినయించడం మొదలైంది సరిగ్గా ఈ నేలలో దళిత ఉద్యమం ఉధృతం దాలుస్తున్నప్పుడే కావడం కొసమెరుపు.)
ఈ కులమే కమ్మ కులం. ఇది ఏ సర్వేనో చేసి రుజువు చేయాల్సిన సత్యం కాదు. సర్వజనులకు తెలిసిన సత్యం. సాక్షి పత్రిక వచ్చిన తర్వాత ఈ కులం గుత్తాధిపత్యం రాత్రికి రాత్రే ప్రశ్నించబడింది. ప్రతి పెట్టుబడి వెనుకా కులం బలం మాత్రమే వుంటుంది. ఆ పెట్టుబడికి ఏకైక ప్రయోజనం ఆ కుల ప్రగతి మాత్రమే కాకపోవచ్చు కానీ అంతిమ ప్రయోజనం మాత్రం అదే. ఇప్పుడు నడుస్తున్నది మీడియా వార్ కాదు. పెట్టుబడుల వార్. కులాల ఆధిపత్యాల మధ్యా, లేదా ఆ ఆధిపత్యాలను ప్రశ్నించిన ఇంకో కులం ప్రయోజనాలకు మధ్య జరుగుతన్న యుద్దం. ఈ పత్రికల, టివిల యజమానులే కాదు రూపర్ట్ మర్డోక్ కూడా ఇదే యుద్ధాన్ని అధికారం కోసమో, తాను నమ్మిన అభిప్రాయాలనే వాస్తవాలుగా ఉత్పత్తి చేయడం  కోసమే అభినయించాలి.
పెట్టుబడి ఎలా ప్రవర్తిస్తుంది, అది అదనపు విలువను సృష్టించేందుకు కనీస విలువలను కూడా ఎలా చాకచక్యంగా తుంగలో తొక్కుతుంది అన్న విషయాలను నేను ఇక్కడ చర్చించను. కావాలంటే సాయంత్రం పూట ఓ అరగంట కామ్రేడ్ కార్ల్ మార్క్స్ తో క్లాస్ ఇప్పిస్తా.
పెట్టుబడులకు లాభాల పేరుతో మరింత పెట్టుబడిని పోగేసుకునే ఏకైక లక్ష్యం మాత్రమే వుండదు. ఒక వేళ వున్నా ఆ లక్ష్యం మీడియా గ్రూపులను నడపడం ద్వారా దొబ్బదు. అందుకే మీడియాలో డబ్బులు పెట్టే వేమూరి రాధాకృష్ణ లాంటి వారు కేవలం ఆర్థిక సంతృప్తి  సాధించడమే తమ లక్ష్యంగా పెట్టుకోరు. ఆత్మ సంతృప్తి సాధించడం అన్న స్వాంతన కార్యక్రమాన్ని తమ స్ర్కీన్ సేవర్లుగా చెలామణీ చేసుకుని నిస్సిగ్గుగా జర్నలిజాన్ని వాడుకునేందుకు వెనకంజవేయరు. ఇందుకు ప్రపంచంలో ఏ ప్రధాన స్రవంతి పత్రికా మినహాయింపు కాదు. ఎందుకంటే మీడియా ముమ్మాటికీ ఒక బిజినెస్సే, జర్నలిస్టులు జీతం తీసుకునే కార్మికులే.
ఈనాడు పత్రిక, టివిల పెట్టుబడిదారుడు రామోజీరావుకు, సాక్షి పెట్టుబడిదారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ , యజమానిగా, జర్నలిస్టుగా సమయానికి తగువిధంగా అభినయించే వేమూరి రాధాకృష్ణకు తమ తమ ప్రయోజనాలున్నాయి తమ మీడియా బిజినెస్ లలో. ఈ విషయం చెప్పడానికి ఏ విశ్లేషకుడు, నిపుణుడు అవసరం లేదు. ఈ పత్రికలను, టివిలను రోజూ వార్తల కోసం కాక వ్యాఖ్యానాలకోసం చదువుతున్న, చూస్తున్న కోట్లాది రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. వాటిని ఆయా పత్రికల్లో రోజూ రాస్తున్న జర్నలిస్టులకూ తెలుసు.
ఇప్పుడు గొడవ వేమూరి రాధాకృష్ణది. తనపై గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కక్ష సాధించాడని 'సాక్షాధారాల' తో సహా ఇప్పుడు చెబుతున్న రాధాకృష్ణదే అసలు గొడవ. తన పత్రిక సంకట స్థితిలో వున్నప్పుడు కొన్ని జర్నలిస్టు సంఘాలు సంఘీభావం తెలపనందుకు వారితోనూ గొడవ. అసలు గొడవలు ఇవైతే అక్కసు మాత్రం జర్నలిస్టులపైన వెళ్ళగక్కుతున్నాడు ఆదిత్య అలియాస్ ఆర్ కె ఉరఫ్ వేమూరి రాధాకృష్ణ తన తాజా చెత్త పలుకులో.
హజార్ చువ్వే ఖాకే బిల్లీ హజ్ జాతా హై
యాజమాన్యానికీ, సిబ్బందికీ మధ్య వున్న గీత చెరిపేసి జీతం కోసం పని చేసి పొట్టపోసుకునే జర్నలిస్టులను తన వాదనకోసం యాజమాన్యం తొత్తులనే సాహసం చేసాడు రిపోర్టర్ టర్నడ్ ఎండి రాధాకృష్ణ తన  తాజా కాలం కం ఎడిటోరియల్ లో. 
సెక్రటేరియట్ రిపోర్టర్ గా తన జర్నలిస్టు ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాధాకృష్ణ గురించి మీడియా ఎంట్రీ గురించి ఒక పిట్ట కథ జర్నలిస్టు సర్కిల్స్ లోనే ప్రచారంలో వుంది.
ఆటవిడుపుకోసం ఆ పిట్టకత ఇప్పుడు మీ కోసం ప్రత్యేకం.
అనగనగా  ఎస్సై కావాలనుకున్న వేమూరి రాధాకృష్ణ. సక్రమంగా కుదరక సెక్రటేరియట్ లోని ఒక అవినీతి జర్నలిస్ట్ ను సంప్రదించగా అతను అక్షరాలా 24 వేల రూపాయలకు సదరు పోస్ట్ అమ్మే విధంగా(ఇప్పించే విధంగా) ఆఫర్ ఇచ్చాడు ఆ బ్రదర్. ప్రయాణ ఖర్చులు సహా పాతిక వేలు తల తాకట్టు పెట్టి సదరు జర్నలిస్టు మిత్రునికి ఇచ్చి ఎస్సై కలలు కన్నాడట విఆర్కే. అలా నెలలు గడుస్తున్నా వర్కవుట్ అవ్వకపోయేసరికి తన కన్నా పవర్ ఫుల్ అయిన ఆ జర్నలిస్ట్ మిత్రుడిపై కోపం పెంచుకున్నాడట. అయితే అతనిపై పెంచుకోవాల్సింది కోపం కాదు మోహం అని తెలుసుకున్న రాధాకష్ణ తన ఎస్సై కలకు గుడ్ బై చెప్పి జర్నలిస్ట్ అయిపోయాడట.
ఎలా వుంది ఆర్కే మీడియా ఎంట్రీ. అదరహో!
( ఆ నాటి నుంచి ఈ పద్ధతిలో జర్నలిస్టులైపోయిన వారే జర్నలిజం అంతు చూశారు ఆ తర్వాతి కాలంలో అదీ అనతి కాలంలోనే. వీళ్ళ వల్లే ఒక వర్గం జర్నలిస్టులు పెంపుడు జంతువులుగా, మరో వర్గం జర్నలిస్టులు పార్టీ కార్యకర్తలుగా మారిపోయారు. ఇక మిగిలింది బడుగు జీవులయిన కూలీ జర్నలిస్టులే.)

ఇక పిట్టకత నుంచి కట్టుకతకొద్దాం.
రాధాకృష్ణ తాజా చిలకపలుకులకు మూలం- సాక్షి పత్రిక, టివిలను నడుపుతున్న జగతి, జనని, ఇందిరా టెలివిజన్ సంస్థలను సిబిఐ ఫ్రీజ్ చేయడం అన్యాయమని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, ఇందుకు సంఘీభావం తెలిపిన ఇంకొంతమంది కలిసి తీసిన ఊరేగింపు. దీన్నే రాధాకృష్ణ తప్పుపట్టాడు. కారణం- సాక్షి అకౌంట్లను ఫ్రీజ్ చేయడం పత్రికా స్వేచ్ఛపైన దాడి కాదు. ఇదీ ఆర్కే వాదన. కాసేపు దీన్ని పక్కనపెడదాం.
సాక్షి మీడియా సంస్థలను నడుపుతున్న అకౌంట్లు సిబిఐ రాత్రికి రాత్రే ఫ్రీజ్ చేసింది. ఆ సంస్థలకు ఎలాంటి  ముందుస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలా చేసింది. సాక్షి అకౌంట్లు వున్న ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లకు సిబిఐ లేఖా రూపంలో ఈ హుకుం జారీచేసింది. అంతే కాదు అదే లేఖలో ఆయా అకౌంట్లలో ఎంత మొత్తం వుంది తెలియజేస్తూ ఎలాంటి లావాదేవీలు లేకుండా తక్షణం వాటిని ఫ్రీజ్ చేయాలని కోరింది. ఆయా బ్యాంకులు సహజ భయంతో ఆగమేఘాలపైన అకౌంట్లను ఫ్రీజ్ చేశాయి. సాక్షి గ్రూప్ లో ఆ యాజమాన్యం చెప్పుకున్నట్టు పరోక్షంగా, ప్రత్యక్షంగా దాదాపు 60 వేల మంది సిబ్బంది వున్నారు. అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయన్న తక్షణం చాలా మంది సాక్షి సిబ్బంది ప్యానిక్ అయిపోయి తమ తమ అకౌంట్లలో వున్న జీతం సొమ్మును డ్రాచేసుకునేందుకు క్యూలు కట్టారు. యాజమాన్యానికి సంబంధించిన అకౌంట్లు మూసివేస్తే తమ సాలరీ అకౌంట్లకు వచ్చిన ఢోకా ఏమీ లేదని తెలియని అమాయకులైన జర్నలిస్టులేమీ కాదు వీరు. దాదాపు 10-20 సంవత్సరాల జర్నలిస్టు అనుభవం వున్న సీనియర్లు వీళ్ళంతా. అయినా బతుకు భయం, అభద్రత, జీతం మీద మాత్రమే ఆధార పడిన జీవితాలు, కుటుంబాలు వున్న సీనియర్ జర్నలిస్టులు కూడా వీళ్లు. తమ తెలివి ఎంత వారించినా ఎలాంటి చాన్స్ తీసుకోలేకే అలా చేసామని నాతో పలువురు సీనియర్లు చెప్పినప్పుడు నిజంగా కళ్ళలో సుళ్లు తిరిగాయి.
మరి తమకు జీతాలిచ్చే యాజమాన్యం అకౌంట్లను ఫ్రీజ్ చేస్తే ఆందోళన చెందడం, నిరసన తెలపడం, యాజమాన్యం పక్షాన నిలబడడం తప్పెలా అవుతుంది? ఆంధ్రజ్యోతి పత్రికో, ఛానలో ఇదే స్థితిలో వుంటే రాధాకృష్ణ తన సిబ్బంది నుంచి ఇదే కదా కోరుకుంటాడు. ఇప్పుడు నటన ఎందుకు? నిరసనకు దిగిన జర్నలిస్టులను చూసి ఎద్దేవా ఎందుకు?
ఇక సాక్షి అకౌంట్లు ఫ్రీజ్ చేయడం పత్రికా స్వేచ్ఛ పై దాడి అవునా ? కాదా? అన్న విషయానికి వద్దాం.
సిబిఐ ఆరోపణ ప్రకారం, ఆంధ్రజ్యోతి రోజూ అచ్చోసే అద్భుతమైన ఇన్ వెస్టిగేటివ్ విశ్లేషణాత్మక టాబ్లాయిడ్ బ్యానర్ ఐటమ్స్ ప్రకారం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుపుతున్న 67 కంపెనీలలో మూడు చిన్న కంపెనీలే జగతి, జనని, ఇందిరా టెలివిజన్. జగన్ చెబుతున్నట్టు తన ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే రాజకీయ దురుద్దేశంతోనో, లేక సిబిఐ చెబుతున్నట్టు అనైతిక మార్గాల్లో కూడుకున్న పెట్టుబడులను నిలవరించడం కోసమో ఈ దాడులు, అకౌంట్ల ఫ్రీజ్ లు జరిగాయి. ఇదంతా సిబిఐకి, జగన్ కూ మధ్య, లేదా జగన్ చెబుతున్నట్టు అతనికీ, సోనియాకు మధ్య జరుగుతున్న గొడవే అనుకుందాం.
మరి జర్నలిస్టులు ఏం చేశారు? దాడులు ఎందుకు మీడియా సంస్థలపైనే జరుగుతున్నాయి? అకౌంట్ల ఫ్రీజ్ ఎందుకు మీడియా కంపెనీలపైనే జరిగింది? మిగతా కంపెనీల వల్ల జగన్ కు మహా అయితే ఆర్థిక లాభాలో, నష్టాలో వుంటాయి. అదే మీడియా సంస్థల వల్ల (ఆర్థిక నష్టాలున్నా సరే) ఎన్నికల సమయంలో ఎలాంటి లాభాలుంటాయో రాధాకృష్ణ కన్నా, ఆ మాటకొస్తే వై ఎస్ జగన్ కన్నా సోనియాకే అంటే  సిబిఐకే బాగా తెలుసు. అందుకే మొదటి అటాక్ మీడియా సంస్థలపైనే. అసలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 102 ప్రకారం సిబిఐకి వున్న విచక్షణాధికారాలను ఇక్కడ వినియోగించుకోవడం కన్నా దుర్వినియోగమే చేసిందనేది నా ప్రగాఢ విశ్లేషణ. అయినా అదంతా కోర్టు చూసుకోవాల్సిన వ్యవహారం. మన మేధో విశ్లేషణలు చెల్లవు కాబట్టి ఆ మధనం అనవసరం.
ఇక సిబిఐ దృష్టిలోంచి చూసి ఇది కేవలం వైఎస్ జగన్ పై అటాక్ అని మాత్రమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇక్కడ యజమాని ఎవరన్నది కేవలం సాంకేతిక విషయమే. అందుకే యజమానితో సంబంధం లేకుండా మీడియా పై దీన్ని సిబిఐ ధమ్కీ అనే అనుకోవాలి. అంటే పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం మీడియాకు ఇచ్చిన ధమ్కీగానే అర్థం చేసుకోవాలి. రాత్రికి రాత్రే సాక్షి పత్రికకు వ్యాపార ప్రకటనలు ఆపేయడం కూడా తొందర పాటు చర్యే కాదు, ముమ్మాటికీ ఫోర్త్ ఎస్టేట్ ను కూల్చే చర్యే. ఇదంతా ఈ ప్రభుత్వానికీ - వై ఎస్ జగన్ కూ మధ్య వున్న తగవు అని ఎవరైనా అర్థం చేసుకుంటే ఆ జర్నలిస్టులంతా నాదృష్టిలో అమ్ముడిపోయినట్టే. అడ్వర్టయిజ్ మెంట్లను ఆపడం కచ్చితంగా మీడియాపై దాడే. పత్రికా స్వేచ్ఛను హరించడమే. జర్నలిస్టుల్లో అభద్రతను పెంచడమే. కలాలపై దాడి చేయడమే. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ప్రాథమిక హక్కులకు తూట్లు పొడవడమే. ఇది యాజమాన్యాల, వారి పెట్టుబడుల గొడవగా చూసి ఒడ్డుకు కూర్చునే జర్నలిస్టులు ముమ్మాటికీ ఆయా యాజమాన్యాల ముద్దుల పెంపుడు జంతువులే.
(పై వాక్యంలోని జర్నలిస్టులు అన్న జాబితాలో 'తగదునమ్మా' అంటూ చేరిపోయిన వేమూరి రాధాకృష్ణ లాంటి వారిని కూడా విశాల హృదయంతో అకామిడేట్ చేస్తూ.)
(ఇక సిబిఐ కేంద్ర ప్రభుత్వ తోక సంస్థ అని వేరే చెప్పక్కరర్లేదు. దానికి ఎలాంటి స్వయం ప్రతిపత్తి లేదు. కేంద్రం ఆదేశిస్తే తప్ప ఎటూ అడుగు కూడా కదపలేని తోలు బొమ్మ విచారణ సంస్థ సిబిఐ.)

నయా ముల్లా జియాదా ప్యాస్ ఖాతా హై
ఆదిత్య అనబడు వేమూరి రాధాకృష్ణ ఇప్పుడు ఆదర్శ జర్నలిస్టు అభినయానికి దిగాడు. అతను సందట్లో సడేమియా అంటూ పోషించాలనుకుంటున్నది అలాంటి ఇలాంటి పాత్ర కాదు. అచ్చం జర్నలిస్టులాగే అత్యంత సహజంగా జీవించేందుకు రాధాకృష్ణ చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ముచ్చటేసే విషయమే. అయితే ఇప్పుడు జర్నలిస్టు పాత్ర పోషిస్తూ సాక్షి జర్నలిస్టుల ఆత్మగౌరవాన్నే దెబ్బతీసేందుకు ఒక కొత్త లాజిక్ లాగుతున్నాడు. ఒక పత్రిక లేదా టివి చానల్ కు పెట్టుబడి ఎక్కడినుంచి వస్తుంది? దాని మంచి చెడులేమిటి? అని తెలిసి ఆయా పత్రికల్లో, టివీల్లో చేరాలని జర్నలిస్టులకు గీతోపదేశం చేశారు వేమూరి వారు. నిజంగా ప్రపంచంలో ఎక్కడైనా కార్మికులకు యజమానులను ఎంచుకునే అవకాశం వుంటుందా? వారి పెట్టుబడుల మూలాలను ప్రశ్నించిన తర్వాతే ఉద్యోగంలో చేరేంత సీన్ వుంటుందా? కథలు చెప్పడం అంటే ఇదే మరి! 
అందుకే ఆదిత్యకు ఈ విషయం మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. సాక్షిలో పనిచేస్తున్న జర్నలిస్టులు కేవలం జీతం తీసుకునే కార్మికులే. ఆ యజమాని అక్రమ డబ్బులు పెట్టుబడిగా పెట్టినా, పవిత్ర పెట్టుబడులు పోగేసినా అప్పనంగా తిలాపాపం తలాపిడికెడు కూడా తీసుకునేందుకు ఏ మాత్రం అర్హత లేని కేవల కూలీలే అందులోని జర్నలిస్టులు.  ఇక సాక్షి పెట్టుబడుల మూలాలు, మంచి చెడ్డల గురించి అక్కసుతో మాట్లాడటం ఆపి కోర్టు మీద గౌరవం వుంచడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయం తేల్చాల్సింది ఒక్క కోర్టు మాత్రమే.
విచిత్రమేమిటంటే ఆంధ్రజ్యోతిలో సిబ్బంది కూడా జీతాలే తీసుకుంటున్నారు.  కానీ వాళ్ళంతా వాటాలు తీసుకుంటున్నారన్నంత బిల్డప్ ఇస్తున్నారు వేమూరి వారు. ఆ జర్నలిస్టులు కూడా రాధాకృష్ణ పెట్టుబడులలో తిలాపాపం తలా పిడికెడు కూడా తీసుకునే హక్కు లేని కేవల కూలీలే. అయితే తన కుతర్కంతో ఇప్పడు జర్నలిస్టులను ముచ్చటగా మూడోసారి చీల్చేందుకు జర్నలిస్టు ముసుగునే తొడుక్కున్న ఆత్మవంచనాపరుడు, కుహనా పెట్టుబడిదారుడు రాధాకృష్ణ.  ఇప్పటికే రెండు సార్లు జర్నలిస్టులు చీల్చబడ్డారు. ఆయా పత్రికలు, టీవీలు కొమ్ముకాసే ఆయా పార్టీల కార్యకర్తలుగా,  ఆయా యూనియన్లు కొమ్ముకాసే పార్టీలకు బాకాలుగా ఇప్పటికే జర్నలిస్టులు రెండుసార్లు చీలిపోతే, ఇప్పుడు పత్రికలకు, పత్రికలకు మధ్యా, టివీకీ, టివీకీ మధ్య కూడా జర్నలిస్టుల్లో విభేదాలు సృష్టించేందుకు చాలా తెలివిగా కుట్ర పన్నుతున్నాడు వేమూరి ఆదిత్య.  రాధాకృష్ణ దుర్బుద్ధిని, చాణక్య నీతినీ తిప్పి కొట్టాల్సిన లేదా చావ కొట్టాల్సిన బాధ్యత ఈ సమాజపు దృక్పథాలను ప్రభావితం చేయగల బడుగు జర్నలిస్టులపైనే వుంది.  వైఎస్ జగన్ తో తేల్చుకోలేక తుమ్మితే ఊడిపోయే జర్నలిస్టులను అడ్డం పెట్టుకుంటున్న వేమూరి రాధాకృష్ణ ఒక తప్పుడు జర్నలిస్టే కాదు అత్యంత ప్రమాదకరమైన యజమాని కూడా.
ఇక జర్నలిస్ట్ నాయకులు దేవులపల్లి అమర్,  కె.శ్రీనివాసరెడ్డి గురించి వేమూరి మాట్లాడిన అవాకులు చెవాలకులను తిప్పికొట్టగల, చితక్కొట్టగల సమర్థత ఆ ఇద్దరు యూనియన్ లీడర్లకు వుంది కాబట్టి వారి మీద వేసిన నిందల జోలికి నేను వెళ్ళడం లేదు. ఒక బీట్ రిపోర్టర్ నుంచి ఎండి స్థాయికి వేమూరి రాధాకృష్ణ ఎదిగిన ప్రయాణంలో కాలం అతనికి ఒక ప్రధానమైన దశను నిరాకరించింది. అదే జర్నలిస్టు దశ. ఆ దశ రాకుండానే వేమూరి దశ తిరిగడం జర్నలింజం చేసుకున్న దురదృష్టం.

-అనంతు